ఏపీ సీఎం చంద్రబాబుపై దాడి చేసేందుకే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయించారని ఏపీ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ కుటుంబరావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయడం చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఈ విషయంపై తాము హైకోర్టులో పిటీషన్ వేశామని చెప్పారు. సీఎం భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేశారంటే చంద్రబాబుపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు.
చంద్రబాబుకి ఏదైనా జరిగితే దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. జగన్ను అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ, ఎలక్షన్ కమిషన్తో కలిసి పెద్ద కుట్ర పన్నిందని భావిస్తున్నట్టు కుటుంబరావు తెలిపారు. ఫామ్-7పై తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఇంతవరకు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కుటుంబరావు ప్రశ్నించారు.