హైదరాబాద్ ఈ-సిటీలో సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్ను ప్రీమియర్ ఎనర్జీస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రీమియస్ ఎనర్జీస్ను ప్రారంభించారు. పీవీ సెల్స్, మాడ్యూల్స్ను ప్రీమియస్ ఎనర్జీస్ ఉత్పత్తి చేస్తుంది. రూ. 483 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియస్ ఎనర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్లలో పెట్టుబడులను రూ. 1200 కోట్లకు పెంచనున్నట్లు ప్రీమియస్ ఎనర్జీస్ వెల్లడించింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పీవీ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిని ప్రారంభించిన ప్రీమియస్ ఎనర్జీస్కు అభినందనలు తెలిపారు. 18 నెలల్లోనే సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభించారు. 700 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించినందుకు అభినందనలు తెలిపారు. ఉపాధి కల్పన ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది, దేశంలో రెండో అతిపెద్దదైన సౌర ఫలకాలు, మాడ్యూళ్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.