అమెరికాలో దుండగుల చేతిలో కాల్పుల సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటిఆర్ ని కలిసి ప్రభుత్వ సహకారాన్ని కోరారు. తమ కుమారుడికి అండగా ఉండాలని, మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సాయి కృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికాకి వెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
ఇప్పటికే సాయి కృష్ణ కు అవసరమైన తక్షణ వైద్య సహాయం గురించి అమెరికాలోని కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తమ ఎన్ఆర్ఐ శాఖ అధికారులు సమాచారం అందించారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. సాయికృష్ణకు వైద్య సాయం అందించాలని సుష్మాస్వరాజ్ను ఎంపీ సీతారాం నాయక్ సోమవారం ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సుష్మ.. అమెరికాలోని భారత రాయబార అధికారులతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల రవాణా ఖర్చులతోపాటు, కొంత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణమే అందిస్తామని సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తెలిపారు.
చంద్రబాబు మౌనీ బాబా అయ్యారు: : విజయసాయి