సీఎం కేసీఆర్ ఇలాక అయిన మెదక్లో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో వంద శాతం టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో 16 ఎంపీ సీట్లను గెలుస్తోందని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మెజారిటీలో మొదక్ మొదటి స్థానంలో, వరంగల్ రెండో స్థానంలో, కరీంనగర్ మూడు లేదా నాలుగో స్థానంలో నిలుస్తాయన్నారు. ఎన్నికల్లో ప్రజలను ఉత్తేజపరచడానికే తన భావ హరీశ్ రావుతో సరదాగా ఛాలెంజ్ విసిరానని చెప్పారు.
ఇక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల పట్ల నమ్మకం లేకనే ఆయన ఢిల్లీలో వీధినాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబులా గగ్గోలు పెట్టొద్దన్నారు. గెలిస్తే సాంకేతికత భేష్ అని, లేకపోతే ఈవీఎంల తప్పు అని చంద్రబాబు అనడం సరికాదన్నారు . 40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న వ్యక్తి ఇంత దిగజారి ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడంలేదన్నారు.
ఎవరు మంత్రులుగా ఉన్నా జనాలకు ఒరిగేదేమీ లేదు: జగ్గారెడ్డి