సువిశాలమైన నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాల వెలికితీత అంశం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం పై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. నల్లమలలో నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని తెలియజేశారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టిన విషయం వాస్తవమేనని తెలిపారు. కానీ నాగర్కర్నూల్-అమ్రాబాద్ ప్రాంతాల్లో ఎటువంటి అన్వేషణ చేపట్టలేదని వివరించారు. ఆయా ప్రాంతాల్లో నిక్షేపాలు ఉన్నప్పటికీ వాటిని తవ్వి తీసేందుకు ఎవరికీ భవిష్యత్తులో కూడా అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు.