మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కోమాకుల, వంశీ చాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు. లాక్డౌన్ కారణంగా సుమారు ఆరు నెలలు పాటు ఆగిన ‘క్రాక్’ షూటింగ్ గత వారం రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃప్రారంభమైంది. రవితేజ, ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ‘క్రాక్’ షూటింగ్కు సంబంధించిన ఒక వర్కింగ్ వీడియోను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో షూటింగ్ సెట్ మొత్తాన్ని ప్రాపర్గా శానిటైజ్ చేయడం, ఎంట్రన్స్లో డిజిన్ఫెక్టెంట్ టన్నెల్ను ఏర్పాటు చేయడం మనం చూడొచ్చు. రవితేజ, గోపీచంద్ మలినేని సహా సెట్లో ఉన్న ప్రతి యూనిట్ మెంబర్ మాస్క్ ధరించి కనిపిస్తున్నారు. కెమెరా ముందుకు వచ్చి నటిస్తున్నప్పుడు మాత్రమే యాక్టర్లు మాస్క్లు తీసేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.
previous post