ఏపీలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూడా వలసలు మాత్రం ఒక పట్టాన ఆగటం లేదు. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీ కీలక నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఇవాళ ఆయన ఆ పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన సుబ్బారాయుడు.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం టికెట్ ఆశించి భంగపడ్డ సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలో ఇవాళ టీడీపీకి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు.