తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత, భువనగిరి లోక్ సభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారలో భాగంగా చేర్యాలలో రోడ్ షో నిర్వహించిన కోమటిరెడ్డి సోదరులు.. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి కవిత ఓడిపోతుందని కేసీఆర్ కు భయం పట్టుకుందని కోమటిరెడ్డి అన్నారు. అందువల్లే కేసీఆర్ టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ప్రస్తుతం నియంత పాలన సాగుతోందని విమర్శించారు. ఇప్పటికైనా ఎదరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందని హెచ్చరించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు కోల్పోవడంతో కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని దుయ్యబట్టారు. భువనగిరి ఎంపీ గా తనను గెలిపిస్తే ప్రజా గొంతుకనై పోరాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.