కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా… కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఎటువంటి ఉపయోగం లేదని… ముఖ్యంగా తెలంగాణకు బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయంలో హైదరాబాద్కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలాయాపన చేస్తున్నారని తెలిపారు. ఎంతోకాలంగా ఉన్న కాజీపేట కేంద్రంగా కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్, ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు పొడగింపు ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద కేసీఆర్ తాకట్టు పెట్టడంతో కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని వివరించారు.
టీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని తెలిపారు. ఎప్పటి లాగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారని దుయ్యబట్టారు. ఈ సమావేశాల్లో తెలంగాణకు, రైతులకు జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేసేందుకు కాకుండా వాటిని కార్పోరేట్ కంపెనీలకు అమ్మేందుకు ఆసక్తి చూపిస్తుందని మండిపడ్డారు. కేంద్రం ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడే బడ్జెట్ కేటాయింపులు జరిగాయని తెలిపారు. రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులను తగ్గించాలనే నిర్ణయం హేయమైన చర్యని వివరించారు. తద్వారా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు కుంటుపడుతున్నాయని మండిపడ్డారు. లాక్డౌన్ వల్ల ఏర్పడిన దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మన దేశంలోని అత్యధిక మంది ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపే విధంగా జడ్జెట్ ఉందని తెలిపారు. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా ద్రోహం చేసిందని… వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయింపులలో భారీగా కోతలు విధించిందని వివరించారు.
కేసీఆర్ ను గద్దె దించడం పెద్ద పనేం కాదన్న రేవంత్