తమిళనాడులో జరిగిన ఓ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. పోలసుల కస్టడీలో తండ్రీ, కుమారుడు ఒకరి తర్వాత మరొకరు మరణించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారికి న్యాయం జరగాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ కస్టడిలో జయరాజ్, ఫినిక్స్ అనే ఇద్దరూ చనిపోయిన ఘటన ట్యూటికోరన్లో జరిగింది. లాక్ డౌన్లో తమ షాపును చెప్పిన సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచినందుకు పోలీసులు ఆ తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. లాకప్లో చిత్ర హింసలు పెట్టారు. దీంతో వారిద్దరూ మరణించారు. అయితే వారికి న్యాయం జరగాలని తమిళ ప్రజలు పోరాటం చేస్తున్నారు. మరో వైపు సుచీ లీక్స్ పేరిట ఫేమస్ అయిన సింగర్ సుచిత్ర ఈ ఘటనపై స్పందించింది. దక్షిణాది సమస్యలు ఎప్పుడూ దక్షిణాదికే పరిమితం అవుతున్నాయని, వారు ఇంగ్లీష్లో మాట్లడలేకపోవడమే అందుకు కారణమని చెప్పుకొచ్చింది. అందుకే ఈ ఘటన గురించి వివరాలను, పోలీసుల అకృత్యాలను తాను వివరించి చెబుతానని, ఈ విషయం అందరికీ తెలిసేలా ఫార్వర్డ్ చేయండని కోరింది. ఇక బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ డిమాండ్ చేశారు. ఆలస్యం జరగకుండా దోషులకు త్వరగా శిక్షపడేలా అందరం కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక కుటుంబం వారి అత్యంత ఆప్తులను కోల్పోయారు. జస్టిస్ ఫర్ జయరాజ్, ఫినిక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనను అమానవీయ చర్యగా పేర్కొంటూ చట్టానికి ఎవరూ అతీతులు కారని నటుడు జయం రవి పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సింగర్ సుచిత్ర సహా పలువురు ప్రముఖులు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.