ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మాజీ స్పీకర్, టీడీపీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు కుటుంబీకులపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కోడెల కుమారుడు శివరాం, కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మిలపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొన్నిరోజుల క్రితం కోడెల కుమార్తె విజయలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదవగా, ఆ కేసును కొట్టివేయాలని లక్ష్మి తరఫున సీనియర్ అడ్వొకేట్ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఘటన జరిగింది 2018 జనవరిలో అయితే, ఫిర్యాదు చేసింది 2019 జూన్ లో అని, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న హైకోర్టు విజయలక్ష్మిని ఈ కేసులో అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కోడెల కుమార్తెకు కాస్త ఊరట లభించింది.