అసెంబ్లీ ఫర్నిచర్ తన వద్ద ఉంచుకున్నారన్న ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై కోడెల ధాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు లో విచారణ జరిగింది. తన క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్లమని అధికారులకు కోడెల గతంలోనే లేఖరాశారని కోడెల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
లేఖ విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు వస్తువులు పోయాయని కేసు పెట్టారని వెల్లడించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ, ఫర్నిచర్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని తెలిపింది. ఏయే వస్తువులు కనిపించకుండా పోయాయో వాటిపై ప్రమాణపత్రం సమర్పించాలని అధికారులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది.