అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో మౌనిక అనే వివాహిత ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ ఘాటుగా స్పందించారు. మౌనిక చనిపోయి 24 గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.
సోమవారం గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద మౌనిక కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. మరణించిన మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని మెట్రో స్టేషన్లలో నిపుణులతో తనిఖీలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ప్రమాదంపై తాను మెట్రో అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.