వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే నిమిత్తం ప్రత్యేకంగా కిసాన్ రైలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కిసాన్ రైలును ఏపీ సీఎం జగన్ ఇవాళ వెబ్ పోర్టల్ ద్వారా ప్రారంభించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే సీఎం జగన్ పచ్చ జెండా ఊపడంతో అనతపురం-న్యూ ఢిల్లీ కిసాన్ రైలు ముందుకు కదిలింది. అదే సమయంలో, కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగాడి, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఢిల్లీ నుంచి జెండాలు ఊపి రైలుకు శ్రీకారం చుట్టారు.
ఈ కిసాన్ రైలు ద్వారా అనంతపురం జిల్లా పండ్ల ఉత్పత్తులను దేశ రాజధానిలో మార్కెటింగ్ చేసేందుకు వీలు కలగనుంది. తద్వారా రైతులకు మరింత మెరుగైన గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
అనంతపురం నుంచి అనేక రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ కు కూడా ఫలాలు ఎగుమతి అవుతుంటాయి. రైతులు సత్వరమే తమ పంటలను ఢిల్లీ తరలించేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది.