ఏపీ సీఎం చంద్రబాబు పై కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి ద్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో రాహుల్గాంధీ మాటలను విశ్వసిస్తున్నామన్న చంద్రబాబు ఎందుకు యూపీఏలో చేరడం లేదని నిలదీశారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిస్తే తప్పేంటని నిలదీశారు. శ్రీకాకుళంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విపక్షాలను సీఎం చంద్రబాబు కలవడం లేదా అని ప్రశ్నించారు. ఇకపై జన్మలో చంద్రబాబు సీఎం కాలేరని ఎద్దేవా చేశారు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని కృపారాణి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయన్నారు.రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈనెల 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.