రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న అతడిని బుధవారం ఉదయం రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ ఘటనలకు తోడు ఇంకేమైనా అరాచకాలు జరిగాయా అనే విషయాలు బయటపడే అవకాశముంది. ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకూ నమోదైన బాలికల మూడు మిస్సింగ్ కేసుల మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ దారుణ హత్యలు శ్రీనివాసరెడ్డే చేశాడని పోలీసులు ఆధారాలు సంపాదించారు.
యాదాద్రి జిల్లా హాజీపూర్లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో శ్రీనివాస్రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి ఈ నెల 8 నుంచి 13 వరకు విచారణ కోసం పోలీస్ కస్టడీకీ అనుమతి ఇచ్చారు.