ఏపీలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ లో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలింది. సదరు ఉద్యోగి కియా మోటార్స్ లోని బాడీ షాప్ లో విధులు నిర్వర్తిస్తుంటాడని, తమిళనాడుకు చెందినవాడని తెలుసుకున్నారు.ఈ నెల 25న ఇతను కర్మాగారానికి వచ్చాడు. వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడిని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ప్రాంగణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
అధికారులు అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కియో మోటార్స్ కూడా ఇటీవలే తెరుచుకుంది. అనేక జాగ్రత్తలు తీసుకునే… ఉద్యోగులను లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి కరోనా బారినపడడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.