telugu navyamedia
క్రైమ్ వార్తలు

రాజ‌స్థాన్‌లో విషాదం :సికార్‌ జిల్లా గుడిలో తొక్కిస‌లాట‌లో ముగ్గురు మృతి..

*రాజ‌స్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది
*సికార్‌ జిల్లా గుడిలో తొక్కిస‌లాట‌లో ముగ్గురు మృతి..

రాజస్థాన్ విషాదం చోటుచేసుకుంది. సికార్‌లోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయం వెలుపల సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని జైపుర్​లోని ఆసుపత్రికి తరలించారు.

హిందూ సంప్రదాయం ప్రకారం.. చాంద్రమాన క్యాలెండర్‌లో 11వ రోజును శ్రీకృష్ణుని అవతారంగా విశ్వసిస్తారు. ఈ మాసోత్సవంలో ఈరోజు ఖాటూ శ్యామ్ జీ దర్శనాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆలయం తలుపులు తెరవగానే భక్తులు ఒక్కసారిగా దర్శనం కోసం పోటెత్తారు. దీంతో ఆలయ ముఖద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో క్యూలో ఉన్న 63 ఏళ్ల మహిళ, మరో ఇద్దరు మహిళలు మరణించారు.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. మృతుల్లో హిసార్​కు చెందిన ఓ మహిళ ఉందని పోలీసులు గుర్తించారు.మిగతా ఇద్దరు మృతులు ఏ ప్రాంతానికి చెందినవారో ఇంకా తెలియలేదు.

కాగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Related posts