పుల్వామా ఉగ్రదాడితో దేశమంతా బగ్గుమంటున్న తరుణంలో బీహార్ రాష్ట్రంలోని ఖైదీలు తమ హృదయాలు కూడా రగిలిపోతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖను రాశారు. యుద్దం వస్తే తాము సరిహద్దుల్లో ముందుండి శత్రువులతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని గోపాల్ గంజ్ సబ్ డివిజనల్ జైలులోని ఖైదీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖను రాశారు. ఉగ్ర దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతుగా రూ. 50 వేలు అందించిన ఖైదీలు, ప్రధానికి రాసిన లేఖలో తమను యుద్ధానికి పంపాలని కోరారు.
సరిహద్దుల్లో ముందు నిలిచి శత్రువులతో పోరాడేందుకు సిద్ధమని ఖైదీలు వెల్లడించారుల. ఈ యుద్ధంలో తాము మరణిస్తే, అమరులుగా గుర్తించాలని, గెలిచి ప్రాణాలతో బయటపడితే తిరిగి జైలుకు వస్తామని వారు పేర్కొన్నారు. జైల్లోని 250 మంది ఖైదీలు ఈ లేఖపై సంతకం చేశారని జైలు అధికారులు తెలిపారు. అమరుల కుటుంబాలకు ఖైదీలు చేసిన సాయం తక్కువే అయినప్పటికీ వారి సంకల్పం గొప్పదని జైలు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ పేర్కొన్నారు.