కేరళలోని ఓ ఆసుపత్రిలో ఆశా వర్కర్, నర్సు పై ఇద్దరు కరోనా పెషేంట్లు దాడికి పాల్పడ్డారు. ఒక రోగి నర్సుపై దాడి చేస్తే, మరో రోగి ఆశా వర్కర్పై దాడి చేశాడు. కొల్లాంలోని ఓ ఆస్పత్రిలో గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. తనకు టీ కావాలని కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. కుటుంబ సభ్యులు సమయానికి టీ తేకపోవడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన అతను అక్కడున్న నర్సుపై దాడి చేశాడు. ఇతను హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించినప్పటికీ.. వీధుల్లో తిరుగుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతన్ని ఆదివారం ఆస్పత్రిలో చేర్చారు.
మరో 27 ఏళ్ల యువకుడు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చాడు. అయితే అతను గల్ఫ్ నుంచి వచ్చాడని విధుల్లో ఉన్న ఆశా వర్కర్ వైద్య శాఖ ఉన్నతాధికారులకు నివేదించింది. తన పేరును అధికారులకు ఎందుకు చెప్పావ్? అంటూ ఆమెపై అతను దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.