ధనుష్తో మరోసారి కీర్తీసురేష్ జత కట్టనుందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ జంట ఇంతకు ముందు తొడరి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం కీర్తీకి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఇద్దరూ బిజీ అయిపోయారు. అలాంటిది మరోసారి కొత్త చిత్రంలో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. చాలా కాలం క్రితం అంటే 1981లో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం నెట్రికన్. ఇందులో కీర్తీసురేశ్ తల్లి మేనక హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు విసు, కే.బాలచందర్ కథ అందించడం, దానికి ఎస్పీ.ముత్తురామన్ దర్శకత్వం వహించడం విశేషం. కాగా ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలన్నది ధనుష్ కోరిక. ఈ విషయాన్ని ఆయన ఇటీవల బయట పెట్టారు. అంతే ఇప్పుడా చిత్రం రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇందులో ధనుష్ సరసన నటి కీర్తీసురేశ్ నాయకిగా నటించనున్నట్లు తెలిసింది.
మామ నటించిన చిత్ర రీమేక్లో అల్లుడు నటించనుండడం, తల్లి నటించిన చిత్ర రీమేక్లో కూతురు నటించడం నిజంగా విశేషం కదా! నెట్రికన్ చిత్రంలో రజనీకాంత్ ప్లేబాయ్ పాత్రలో నటించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర. ఇప్పుడు దీనికి రీమేక్లో ధనుష్ నటించడం అంటే కచ్చితంగా చాలెంజే అవుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా కీర్తీసురేశ్ ప్రస్తుతం రజనీకాంత్ 168వ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మలమాళంలో మోహన్లాల్తో కలిసి రూ.100 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తోంది. దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ నిర్మిస్తున్న పెన్గ్విన్ చిత్రంలో నటించింది. హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రం అయిన ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.