ఏపీ రాజకీయాలలో కేసీఆర్ కల్పించుకుంటానని గత ఎన్నికలలో విజయం సాదించగానే అన్న విషయం తెలిసిందే. అయితే అది ప్రత్యక్షంగా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అందుకు విరుద్ధంగా పరోక్షంగా కేసీఆర్ తన గిఫ్ట్ చంద్రబాబుకు ఇస్తున్నట్టే ఉంది. వైసీపీ లోకి టీడీపీ వలసల వెనుక కేసీఆర్ హస్తం ఉందని తాజాగా చంద్రబాబు పేర్కొన్నారు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలతో జగన్కు దిక్కు తోచడం లేదన్నారు. కేసీఆర్ సాయంతో టీడీపీ నేతలను జగన్ వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆస్తులున్న వారిని వైసీపీలో చేరమని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంకా ఒకరిద్దరు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పుల్వామా ఘటన గురించి స్పందిస్తూ, జవాన్లకు అండగా నిలుస్తాం కానీ, రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెట్టమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్వార్ధం కోసం ఏం చేయడానికైనా ప్రధాని సిద్ధమేనని ఆరోపించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోడీ వ్యవహరిస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు.