తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించలేదని ఆ పార్టీ మాజీ ఉపాధ్యక్షురాలు, సినీ నటి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 17 సంవత్సరాల టీడీపీకి సేవ చేస్తే, తనకు సరైన న్యాయం జరుగలేదని తెలిపారు. కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన కవిత, మండపేట పట్టణ వైశ్య నేత కాళ్లకూరి నాగబాబు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. బీజేపీ ఒంటరిగానే పోటీచేసి తెలుగు రాష్ట్రాల్లో గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత జగన్ పాలనకు, గత చంద్రబాబు పాలనకు పెద్దగా తేడా లేదని విమర్శలు గుప్పించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు.
ఎంతో కాలంగా నలుగుతున్న జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించిన నరేంద్ర మోదీదేనని, ఆయన పాలనలో తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. తమ పార్టీ ఎన్నడూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. తాను ప్రస్తుతం సినిమాలు, టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని అన్నారు. తనకు బీజేపీలో మంచి గుర్తింపును ఇచ్చారని, ఆ పార్టీ ప్రజారంజక పాలనను చూపుతుందని కళ్లముందుంచిందని తెలిపారు.