కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్ చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అతడు సంచలన ప్రదర్శనతో దుమ్మురేపాడు. డెన్మార్క్ షట్లర్ జొర్గన్సెన్పై 24-22, 21-8 తేడాతో విజయం సాధించాడు. శనివారం నిర్వహించే సెమీస్లో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమొటాతో కశ్యప్ తలపడనున్నాడు. క్వార్టర్స్ పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి గేమ్ను ఇద్దరు షట్లర్లు 2-2తో మొదలు పెట్టినా చూస్తుండగానే జొర్గన్సెన్ 8-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 11-8తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు.
ఈ క్రమంలో విజృంభించిన కశ్యప్ వరుస పాయింట్లతో చెలరేగాడు. 12-12తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి ఇద్దరు ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. 15-15, 16-16, 21-21, 22-22కు చేరుకున్నారు. అత్యంత ఒత్తిడిలో తెలివిగా ఆడిన కశ్యప్ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్ గెలిచాడు. రెండో గేమ్లో భారత షట్లర్ దూకుడు ముందు జొర్గన్సెన్ నిలవలేకపోయాడు. కశ్యప్ 11-7తో దూసుకెళ్లాడు. ఆ తర్వాత వరుస పాయింట్లతో చెలరేగి 21-8తో రెండో గేమ్ను ముగించాడు.