జమ్ము కశ్మీర్ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఆదివారం రాత్రి అల్లరి మూకలు రెచ్చిపోయారు. జ్రాదీపోరాలో ఓ ట్రక్కు డ్రైవర్పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నూర్ మహ్మద్ దార్(42) చికిత్స పొందుతూ కన్నుమూశారు.
రాళ్ల దాడికి పాల్పడ్డ అల్లరిమూకలను పోలీసులు చెదరగొట్టారు. ఈ దాడి కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుకాల ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు వారిద్దరిని విచారిస్తున్నారు. ఆ ట్రక్కు సెక్యూరిటీకి చెందిన వాహనం అనుకొని దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.