జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఇరుకున పెట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ నానా రచ్చ చేసినప్పటికీ ప్రపంచదేశాలన్నీ భారత్ కే మద్దతుగా నిలిచాయి. తాజాగా మాల్దీవుల పార్లమెంటులో పాకిస్థాన్ కు ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ అన్నది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని మాల్దీవుల్లో జరుగుతున్న దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు తీర్మానించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాకిస్థాన్ పార్లమెంటరీ బృందం చేసిన డిమాండ్లను తిరస్కరించింది. పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్(సీపీఈసీ) విషయంలోనూ పాక్ సవరణలకు డిక్లరేషన్ లో చోటు దక్కలేదు. ఈ భేటీలో భారత ప్రతినిధి బృందానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహించారు. ఆయన ప్రతిపాదించిన పలు సవరణలకు సదస్సులో ఏకగ్రీవ ఆమోదం లభించింది.