తెలంగాణ ప్రభుత్వం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల అప్రమత్తమైంది. కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదుకానప్పటికీ, ముందస్తు చర్యలు ప్రారంభించింది. అనుమానితులకు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. చైనా తదితర కరోనా పీడిత దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్నవారికి శంషాబాద్ విమానాశ్రయంలో ఢిల్లీకి చెందిన సెంట్రల్ మెడికల్ అథారిటీ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎవరికైనా వైరస్ లక్షణాలున్నట్టు అనుమానం వస్తే, వెంటనే వారిని ఫీవర్, గాంధీ ఆస్పత్రులకు తరలించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా అనుమానితులకు ఫీవర్ హాస్పిటల్, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందించనున్నారు. ఎవరైనా అనుమానితులు లేదా బాధితరోగులు ఉంటే వారికి ముందుగా ఫీవర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తారు. వ్యాధి నిర్ధారణ జరిగితే గాంధీలోని ఐసోలేటెడ్ వార్డుకు తరలిస్తారు. గాంధీలో స్వైన్ఫ్లూ బాధితులకోసం ఏర్పాటు చేసిన 20 పడకల ఐసోలేటెడ్ వార్డునే కరోనా రోగులకు వినియోగించనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ కూడా స్వైన్ఫ్లూ మాదిరిగా ఒక అంటు వ్యాధి. ఒకరినుంచి మరొకరికి ఇది సోకుతుంది. కరోనా వైరస్ సోకిన రోగి తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే తుంపుర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. వారు పీల్చి, వదిలే గాలి ద్వారా కూడా సోకుతుంది. దీనికి ప్రత్యేక చికిత్స లేదు. స్వైన్ఫ్లూ మాదిరిగానే ఐసోలేటెడ్ వార్డుల్లో ఉంచి వైద్యం అందించాలి.