కర్ణాటకలో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఆ రాష్టం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికే వరదల్లో చిక్కుకొని ఎందరో మరణించారు. మరో వైపు వరద భీభత్సానికి అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరదల పరిస్థితిని వివరిస్తూ ప్రధాని మోదీకి జేడీఎస్ అధినేత దేవెగౌడ ఓ లేఖ రాశారు. కర్ణాటకలో ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని తెలిపారు.
సహజ విపత్తుగా గుర్తించి తాత్కాలిక సహాయం కింద రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. కాగా, వరదల కారణంగా కర్ణాటకలోని బెళగావి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణా కేంద్రం తాజాగా వెల్లడించింది.