మంత్రి పదవి కోల్పోయి అజ్ఞాతంలో రాజకీయం చేస్తున్న రమేశ్జార్కిహొళి ఎత్తుగడలకు విరుగుడుగా కొత్త వ్యూహాలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆపరేషన్ కమలతో సంకీర్ణానికి ముప్పు ఏర్పడితే తమిళనాడు తరహాలో వ్యవహరించి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మంత్రి డి.కె.శివకుమార్ నేరుగా సీఎం కుమారస్వామితో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.అక్రమ మార్గంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొడితే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
రమేశ్జార్కిహొళి వెంట కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేలు వెంట నడవడాన్ని పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్లో ఎంతమంది రాజీనామా చేస్తారో, అవసరమైతే అంతేమంది బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు వెనుకాడకూడదని భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినపుడు, వ్యతిరేకులు 18మందిపై వేటు వేసి ప్రభుత్వాన్ని రక్షించుకున్నారు. అదే విధానాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు.
సంతృప్తులు రాజీనామా చేస్తే కొంతకాలంపాటు ఆమోదించకుండా వాయిదావేయడం, చివరకు ప్రభుత్వానికి ముప్పు ఏర్పడితే బీజేపీలో అసంతృప్తి రేకెత్తించాలన్న ఆలోచన కూడా లేకపోలేదు. సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన రమేశ్కుమార్ స్పీకర్గా ఉండడంతో ప్రత్యామ్నాయాలను సులభతరం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. గతంలో బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పీకర్ కె.జి.బోపయ్య సభలో గొడవ చేశారన్న ఆరోపణపై కొందరు ఎమ్మెల్యేలపై వేటు వేసి ప్రభుత్వాన్ని రక్షించుకొనేందుకు సిద్ధమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది.