కన్నడ స్టార్ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన వయసు 44 సంవత్సరాలు. కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జీర్ణ సంబంధమైన సమస్యతో ఆయన మార్చి 31న ఆసుపత్రిలో చేరగా.. కిడ్ని, శ్వాసకోస సమస్యలు ఉన్నాయని తేలింది. ఈక్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రకాశ్ మరణవార్త తెలియగానే ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా ‘మస్త్ మజా మాది’ (2008), ‘అయితలకడి’ (2010), ‘మల్లిఖార్జున’ (2011), ‘ఆర్యన్’ (2014) సినిమాలు ఆయనకు నటుడిగా పేరు, గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయనశైలి ప్రత్యేమైన హావభావాలకు గాను బుల్లెట్ ప్రకాశ్ అనే పేరు స్థిరపడిపోయింది. కన్నడ, తమిళ్ మరియు ఇతర భాషల్లో 325 పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్ కన్నడ సినీ రంగంలో కమెడియన్గా మంచి పేరు సంపాదించారు. ‘ధృవ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి.. శివరాజ్కుమార్, పునీత్ రాజ్కుమార్, దర్శన్, ఉపేంద్ర, సుదీప్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారాయన. బిగ్బాస్ కన్నడ సీజన్-2లో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రకాశ్ బీజేపీ కార్యకర్తగా కూడా పనిచేశారు. ప్రకాశ్ మృతికి పలువురు కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.
previous post