telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘భారతీయుడు 2’ ఆగిపోనుందా…!

Kamal-Hassan

ఏ ముహూర్తాన పాతికేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు’కి సీక్వెల్ తీయాలని అనుకున్నారో కానీ మొదలైనప్పటి నుంచి ఏవో ఒక సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి. ముందేమో సినిమాకు ఏ.ఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత రెహమాన్ వద్దు అని ఎవరో అనడంతో అనిరుధ్ రవిచందర్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువైపోతోందని దాంతో శంకర్‌కు లైకా ప్రొడక్షన్స్‌కు మధ్యలో విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యలో కొన్ని నెలల పాటు సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత సినిమా ఆగిపోయే ఛాన్సే లేదు షూటింగ్ మొదలైపోయింది అని కమల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడేమో పెద్ద ప్రమాదం జరగడంతో సినిమా మొత్తానికే ఆగిపోయింది. గత నెలలో ‘భారతీయుడు 2’ సెట్స్‌లో జరిగిన భారీ ప్రమాదం వల్ల ముగ్గురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. సెట్‌లో ఉంచిన భారీ క్రేన్ మీదపడడంతో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు ఓ లైట్‌మెన్ అక్కడికక్కడే చనిపోయారు. స్పాట్‌లో దర్శకుడు శంకర్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు. వీరంతా వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఫిబ్రవరి 19న చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్‌లో ‘భారతీయుడు 2’ షూటింగ్ జరుగుతోంది. సెట్స్‌లో దర్శకుడు శంకర్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్‌తో పాటు ఎందరో టెక్నీషియన్లు ఉన్నారు. అదే సెట్‌లో ఓ భారీ క్రేన్‌ను కూడా నిలిపి ఉంచారు. ఓ టెంట్‌లో ఉన్న అందరూ సన్నివేశాల గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి క్రేన్ మృత్యువు రూపంలో వచ్చి వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక లైట్‌మెన్ దుర్మరణం చెందారు. కమల్, శంకర్ దగ్గరుండి బాడీలను దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురి కుటుంబాలకు కమల్ హాసన్, శంకర్‌తో పాటు లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా చెరో కోటి సాయం చేసింది. ఈ ఘటన తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై కమల్ హాసన్ నిందలు వేసారు. ముందేమో ఈ ఘటనపై సినీ ప్రముఖులు కూడా సాయం చేసి తోడుగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అన్నారు. ఇప్పుడేమో నిర్మాణ సంస్థ సెట్స్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ సరైన రక్షణ కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆరోపించారు. అంతేకాదు అందరికీ రక్షణ బీమా కల్పిస్తేనే షూటింగ్‌లో పాల్గొంటామని, అప్పటివరకు ఎవ్వరూ సెట్స్‌కి రారని చెప్పారు. దాంతో నిర్మాణ సంస్థ కమల్ మాటలను ఖండించింది. జరిగిన దాంట్లో అందరిదీ సమాన బాధ్యత అంటూ ఘాటుగా స్పందించారు. ఈ ఘటన అనంతరం సీబీఐ దర్శకుడు శంకర్‌కు నోటీసులు పంపింది. అంతేకాదు ఆయన్ను రెండున్నర గంటలకు పైగా విచారణ జరిపింది. జరిగిన ప్రమాదానికి లైకా సంస్థే కారణం అంటూ కమల్ పదే పదే సంస్థపై నిందలు వేస్తుండడంతో ఇరువురి మధ్య అంతర్గత వివాదాలు నెలకొన్నాయి. ఇలా నిందలు వేయడం బాగోలేదని నిర్మాతలు, రక్షణ కల్పించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కమల్ హాసన్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటుండడంతో ‘భారతీయుడు 2’ సినిమాను ఆపేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే ఎన్నోసార్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆగిపోతోందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

Related posts