అధికార వైసీపీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరోక్ష విమర్శలు చేశారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష విరమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు..సిమెంట్ ఫ్యాక్టరీలూ పెట్టలేదని అన్నారు. తనకు తెలిసిందల్లా సినిమాల్లో నటించడమేనని అన్నారు. ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమాలను ఆదరించారని, నచ్చకపోతే పక్కనబెట్టారని చెప్పారు.
అందరికీ సెలవులుంటాయి కానీ రైతుకు మాత్రం ఉండవని అంటూ సీఎం జగన్ గురించి ప్రస్తావించారు. ‘మన జగన్ రెడ్డి గారికి శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. ముఖ్యంగా నన్ను తిట్టే ఎమ్మెల్యేలకు సెలవులుంటాయి కానీ రైతుకు సెలవు లేదు’ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ పాలనను కూల్చివేతలతో ప్రారంభించిందని, భవన నిర్మాణ కార్మికుల జీవితాలను కూల్చివేసిందని మండిపడ్డారు.