హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో మంగళవారం రాత్రి టీవీ నటి నాగఝాన్సీఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఝాన్సీ కేసులో ఆమె ప్రియుడు సూర్యతేజను పోలీసులు విచారించారు. ఝాన్సీ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని సూర్యతేజ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె తనకు ఓ ఫంక్షన్ లో పరిచయమైందని చెప్పిన ఆయన, సినిమాలు, సీరియళ్లలో ఆమెకు అవకాశాల్లేవని తెలిపారు. బాబీ, గిరి అనే బ్రోకర్లు ఆమెకు నటన నేర్పించారని అన్నాడు. ఆ తరువాత ఆమె ఎన్నో ఇబ్బందులు పడిందని, తనకు విషయం చెప్పి బాధపడేదని చెప్పాడు.
ఆమె జోలికి వెళ్లవద్దని తాను గతంలో గిరిని హెచ్చరించానని, ఝాన్సీని కూడా పద్ధతి మార్చుకోవాలని ఎన్నోమార్లు సూచించినా ఆమె వినలేదని అన్నాడు. ఆ కారణంతోనే ఆమెతో మాట్లాడటం లేదని, కొన్నాళ్లుగా దూరంగా ఉన్నానని చెప్పాడు. కాగా ఈ కేసులో ఝాన్సీ సెల్ ఫోన్ కీలక సాక్ష్యాలను అందిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు ఐటీ నిపుణుల సాయం తీసుకుంటున్నారు.