ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ బెదిరింపులకు భయపడేవాడ్ని కాదని ఆయన అన్నారు. ఆయన బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని చెప్పారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాహనాలకు సంబంధించి తప్పుడు పత్రాలను సృష్టించారనే కేసులో ప్రస్తుతం వీరిద్దరూ రిమాండ్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకునే తమ బస్సులు, లారీలను ఆపేశారని మండిపడ్డారు. తన వ్యాపారాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ ఆలోచించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలనేది జగన్ ఆలోచన అని అన్నారు.