- ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ను గెలిపించుకోవాలన్న పట్టుదల రెడ్లలో కనిపించిందని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. రెడ్లు చావోరేవో అన్నట్టు పోరాడారని ఆయన స్పష్టం చేశారు. స్త్రీమూర్తుల దెబ్బతో రెడ్ల కోరిక నెరవేరలేదని దివాకర్రెడ్డి తేల్చిచెప్పారు. కమ్మవారు ఓ వైపు.. రెడ్లు మరో వైపు అనే సామాజిక కోణం రాజకీయాల్లో మంచిదికాదని ఆయన సూచించారు. మధ్యాహ్నం తర్వాతే హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపారు. జగన్ అధికారంలోకి వస్తే కేసులు తీసేస్తాడనే నమ్మకం వైసీపీ శ్రేణుల్లో కనిపించిందన్నారు. అందుకే హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని చెప్పారు. జగన్ చుట్టూ చేరినవాళ్లు కూడా అతన్ని అలా తయారు చేశారని విమర్శించారు.
- వచ్చే ఐదేళ్లలో లోకేష్ను సీఎం చేసే విషయం చంద్రబాబు ఆలోచించాలని తెలిపారు. లోకేష్ను సీఎం చేయాలంటే అన్ని సామాజికవర్గాలను ఆయన దగ్గరకు తీయాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలు మితిమీరాయని జేసీ అన్నారు. అధికారంలో ఎవరున్నా సంక్షేమానికి హద్దుండాలన్నారు. రాజ్యాంగ బద్దమైన నిబంధన ఉండి తీరాల్సిందేనని చెప్పారు. స్త్రీమూర్తులు, వృద్ధులే చంద్రబాబును గెలిపిస్తున్నారని జోస్యం చెప్పారు. క్యూలైన్లలో మహిళలను చూశాక టీడీపీ గెలుపు ఖాయమని తేలిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.