ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య మొత్తానికి ఒక కొలిక్కి వచ్చినట్టే ఉంది. ఇప్పటివరకు ఆస్తికోసం కుటుంబసభ్యులు చంపేశారన్న ప్రచారం జరిగింది. అయితే, అప్పు తీర్చని కారణంగా జయరాంను కొట్టి చంపినట్లు నిందితుడు రాకేశ్ విచారణలో నేరాన్ని అంగీకరించాడు. సోమవారం పోలీసుల విచారణలో జయరాంను చంపిన వివరాలను రాకేశ్ వెల్లడించాడు. రాకేశ్ మాట్లాడుతూ.. శిఖా చౌదరి కంటే ముందే, రెండేళ్ల నుండే తనకు జయరాంతో పరిచయముందన్నాడు. టెట్రాస్ పాలీలెన్స్ కంపెనీ ఉద్యోగుల జీతం కోసం…జయరాం తన వద్ద రూ.4.5 కోట్ల అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బు ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వలేదని చెప్పాడు. శిఖా చౌదరి ప్రేమ పేరుతో తనతో రూ.లక్షలు ఖర్చు పెట్టించిందని, పెళ్లి చేసుకుంటానని శిఖ చెప్పి తనను మోసం చేసిందని అన్నాడు. శిఖ నుండి రావాల్సిన డబ్బులు కూడా జయరామే ఇస్తానన్నాడని, కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పాడు.
29 న అమెరికా నుండి వచ్చిన జయరాం ను డబ్బులు అడిగానని, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లినట్లు రాకేశ్ తెలిపాడు. అక్కడ జరిగిన గొడవలో.. జయరాంను గట్టిగా కొట్టానని, జయరాం హార్ట్ పేషెంట్ కావడంతో చిన్న దెబ్బకే చనిపోయాడని తెలిపాడు. మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక, సాయంత్రం వరకూ ఇంట్లోనే ఉంచానని చెప్పాడు. తర్వాత కారులో జయరాం మృతదేహాన్ని నందిగామ సమీపంలో వదిలేశానని, తిరిగి బస్సులో హైదరాబాద్ తిరిగొచ్చేశానని రాకేశ్ వెల్లడించాడు.