తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. శిఖా చౌదరియే జయరాం హత్యకు కారణమని మృతుని భార్య పద్మశ్రీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జయరామ్ హత్యకేసును మొదటినుంచి దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరి కాల్ లిస్టులో ఆ క్రికెటర్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది.
జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరి విల్లాకు ఆ యువ క్రికెటర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రికెటర్ ఎవరనేది తెలియడం లేదు. అతను ఐపిఎల్ మ్యాచులు కూడా ఆడినట్లు చెబుతున్నారు. జయరాం చివరి కాల్ కూడా శిఖా చౌదరికే వెళ్లినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజు జయరాం రాత్రి ఏడున్నర గంటల వరకు శిఖా చౌదరి ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. జయరాం భార్య పద్మశ్రీ హైదరాబాదుకు చేరుకోక ముందే డాక్యుమెంట్లు తెచ్చుకోవాలని తల్లి శిఖా చౌదరికి చెప్పినట్లు తెలుస్తోంది.