చిగురుపాటి జయరామ్ హత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆస్తి కోసమే చిగురుపాటి హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో వివాహేతర సంబంధాలు, డేటింగ్లు తదితర అంశాలు బహిర్గతమవుతున్నాయి. నిందితులు వీటిని అంగీకరించడమే కాదు.. హత్యకు గురైన జయరాం వ్యక్తిత్వంపై కూడా ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ టీవీ యాంకర్ను ఎరగా వేసి ఈ హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసు విచారణలో పొంతన లేని అంశాలు బహిర్గతమవుతున్నాయి. మరోవైపు ఈ కేసు దర్యాప్తు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు జిల్లా పోలీసు యంత్రాంగంపై ఆరోపణలు వస్తున్నాయి. కొంత మందిని తప్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొని వీఆర్కు వెళ్లిన వారిని ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించడం, ప్రముఖ సినీ నిర్మాత రావడం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 31న రాతి జయరాం హత్యకు గురైన విషయం తెలిసిందే. నందిగామ సమీపంలో కీసర టోల్ప్లాజా సమీపంలో కారులో శవమై రోడ్డు పక్కన కనిపించారు. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన చిగురుపాటి జయరామ్ బిగ్షాట్ కావడం, బిలియనీర్ ఎన్నారైగా గుర్తింపు ఉండటంతో కేసు దర్యాప్తు ప్రాధాన్యం సంతరించుకుంది. హత్యకు సంబంధించి జయరాం మామ ఫిర్యాదు చేశారు. ప్రధాన సూత్రధారులుగా వారి బంధువులు ఉండటం విశేషం. మేనకోడలుగా భావిస్తున్న శిఖాచౌదరి అలియాస్ మాధురిగా అనుమానించారు. రెండు రోజులు గడిచిన తర్వాత ఆమెకు హత్యతో నేరుగా సంబంధం లేదనే వాదన తెరమీదకు తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన ఈ పరిస్థితుల్లో పోలీసుల దర్యాప్తు మాత్రం గందరగోళంగా మారుతోంది. సీసీటీవీ ఫుటేజీలు, కాల్డేటాలు, బ్యాంకు లావాదేవీలు.. వేలిముద్రలు ఇలా ఎన్నో రకాల ఆధారాలు ఉన్నా హంతకులు ఎవరనేదానిపై మల్లాగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో ప్రధానంగా శిఖాచౌదరి, రాకేష్రెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. పోలీసు విచారణలో వీరు చెప్పిన అంశాలు భిన్నరకాలుగా ఉన్నాయి.