ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితుడైన రాకేష్ రెడ్డి నేర చరిత్ర గురించి కూపీ లాగుతున్నారు పోలీసులు. ఈ కేసును విచారిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. రాకేష్ రెడ్డి నేర చరిత్రలో గతంలో ఓ హీరోయిన్ వ్యభిచారం కేసులో పట్టుబడ్డాడని, ఎమ్మెల్యే పేరు చెప్పి 80 లక్షల రూపాయలు వసూలు చేశాడని గుర్తించారు పోలీసులు. అంతేకాదు రాకేష్ రెడ్డి పాత్ర హైదరాబాద్ లో అనేక మోసాలు, దందాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత నెల 31న జయరామ్ ను కిడ్నాప్ చేసినట్లు విచారణలో వెల్లడించాడు రాకేష్ రెడ్డి. జయరామ్ తన స్నేహితుడి దగ్గర 6 లక్షలు తీసుకొని రాకేష్ రెడ్డి మనుషులకు ఇవ్వగా… రూ.5.5 కోట్లకి 6 లక్షలు ఇవ్వడమేంటని రాకేష్ రెడ్డి, జయరాంతో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వాగ్వాదంలోనే రాకేష్ రెడ్డి ఆగ్రహంతో జయరాంపై మూడు పిడిగుద్దులు గుద్దగా… జయరామ్ హార్ట్ పేషంట్ కావడంతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. దీంతో రాకేష్ రెడ్డి మృతదేహాన్ని నందిగామ తీసుకొచ్చి, దాన్ని ప్రమాదంగా చిత్రికరించి బస్ ఎక్కి వెళ్లిపోయినట్లు విచారణలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జయరాం హత్యకు, శిఖాచౌదరికి సంబంధం లేదని, ఆర్ధిక వ్యవహారాలే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.
previous post
next post