దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూకు విశేష స్పందన వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయన తెలిపారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణే మన కర్తవ్యం అని ఉద్ఘాటించారు. ఈ నెల 31 వరకు సబర్బన్, మెట్రో రైళ్లు నిలిపివేస్తున్నామని అన్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కోరామని చెప్పారు. అత్యవసర రవాణా సేవలే అందించాలని రాష్ట్రాలను కోరామని వెల్లడించారు. విదేశాల్లో ఉన్నవాళ్లు ఇంకా మనదేశానికి వస్తున్నారని, అందువల్ల కరోనా వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లను మొదట ఐసోలేషన్ కు తరలిస్తున్నామని చెప్పారు.