రాష్ట్ర వ్యాప్తంగా జనసేన యువ అభ్యర్థులతో కమిటీలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి రూపొందించనున్నట్టు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ తరఫున బరిలోకి దిగిన యువ అభ్యర్ధులతో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రతి అభ్యర్ధికి ఏ ఏ అంశాల మీద అవగాహన ఉంది అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువ అభ్యర్థులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ, ప్రతి సమస్యపై ఓ కమిటీ వేస్తామని, ఆయా సమస్యల మీద అవగాహన ఉన్న వారికే బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఎవరికి కేటాయించిన సమస్యలపై వారు అధ్యయనం చేసి పార్టీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో కమిటీలో మూడు నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారని, కమిటీల ఏర్పాటు బాధ్యత ‘ప్యాక్’ చూసుకుంటుందని అన్నారు.
ఈ కమిటీల నియామక ప్రక్రియ ఆగస్ట్ 7వ తేదీ నాటికి పూర్తవుతుందని, వ్యవసాయం, సహకార రంగం లాంటి అంశాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఆయా సమస్యలకు సంబంధించి పోరాటానికి తాను వెళ్లాల్సి వచ్చిన సందర్భాల్లో సదరు కమిటీలు ముందుగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం జరపాల్సి ఉంటుందని సూచించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన సందర్భంలోనూ ఆయా కమిటీలు ముందుగా నివేదికలు రూపొందించాలని, కమిటీలలో ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు పోటీ చేయని వారు కూడా ఉంటారని, వారి పనితీరు ఆధారంగా ఈసారి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పార్టీ నిర్మాణంలో యువ అభ్యర్ధులను భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.