telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ మాట తప్పి… మడమ తిట్టారు

 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10,143 ఉద్యోగాలనే భర్తీ చేస్తామని ప్రకటించడం ద్వారా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. గ్రూప్‌-1, గ్రూప్-2 విభాగాల్లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు చూపించిందన్నారు. భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని నాదెండ్ల ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టుగా కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 2.59 లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేశామని గొప్పలు చెప్పుకుంటోన్న వైసీపీ.. ఇదే వాలంటీర్లు జీతాలు పెంచాలని ఆందోళనకు సిద్ధమైతే.. మీవి ఉద్యోగాలు కావు.. స్వచ్ఛంద సేవ మాత్రమే అని స్వయంగా సీఎం జగన్‌ ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్ ప్రచారం కోసం మాత్రం వాళ్లవి ఉద్యోగాలు అని చెబుతున్నారు. ఆర్టీసీలో 51 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యేనాటికి ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా కొత్తగా నియమించినట్లు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. శాఖల వారీగా ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

Related posts