73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాను ఎగురవేసిన పవన్ కల్యాణ్ వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. అనంతరం పవన్ ప్రసంగిస్తూ దేశప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒకరూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఆ త్యాగధనుల పోరాట ఫలితమేనని అంతా గుర్తుంచుకోవాలని సూచించారు.
త్యాగధనుల అడుగుజాడల్లో నడిస్తేనే వారి పోరాటానికి నిజమైన విలువ ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఎందరో పోరాటయోధుల త్యాగఫలితమే నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నస్వేచ్ఛకు కారణమని తెలిపారు. ఆ త్యాగధనులకు అంజలి ఘటించి, వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. రాజకీయ జవాబుదారీతనం సిద్ధించినప్పుడే సమరయోధులు అందించిన స్వాతంత్య్రానికి సార్థకత చేకూరుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అవినీతి, అక్రమాల నుంచి సమాజాన్ని రక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
y