జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా మరో పార్టీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష పార్టీలతోపాటు జాతీయ పార్టీ బీఏస్పీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.
శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ వెళ్లిన పవన్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అందువల్లే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. అందుకు మయావతి మార్గ నిర్దేశకత్వం చాలా అవసరం అని పవన్ వ్యాఖ్యానించారు.