వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు దోచుకున్న వ్యక్తి సీఎం అయితే ఇంకేమైనా ఉందా అని నిలదీశారు. వైఎస్ జగన్ అవినీతి వల్ల ఐఏఎస్ అధికారులు జైళ్లపాలయ్యారని పవన్ ఆరోపించారు.
జగన్ సీఎం అయితే అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్తున్నాడని ఆయన మాటలు నమ్మెుద్దని హితవు పలికారు. జగన్ సీఎం అయిన తర్వాత ప్రతీ ఇంటిలో తన ఫోటో ఉండాలన్న వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. ప్రతీ ఇంటిలో వైఎస్ జగన్ ఫోటో ఎందుకు ఉండాలో చెప్పాలని నిలదీశారు. వైఎస్ జగన్ ఏమైనా మహాత్మగాంధీయా లేక డా.బి.ఆర్ అంబేద్కర్ చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలనే ధ్యాసతప్ప ఏనాడైనా ప్రజల కోసం పనిచేశారా అంటూ ప్రశ్నించారు. సీఎం పదవి మీ కుటుంబాల సొత్తు కాదని పవన్ వ్యాఖ్యానించారు.