తెలంగాణ సీఎం కేసీఆర్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ జిల్లా అనకాపల్లి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి ఇబ్బంది పెడుతున్న కేసీఆర్తో వైసీపీ అధ్యక్షుడు జగన్ సన్నిహితంగా ఉంటున్నారని పవన్ దుయ్యబట్టారు. కేసీఆర్కు చేతనైతే ఆంధ్రాలో కూడా ఏపీ రాష్ట్ర సమితి పార్టీని పెట్టి పోటీ చేయాలని పవన్ సవాల్ విసిరారు. ఏపీలో బీసీలుగా ఉన్న గవర కులస్థులను తెలంగాణలో ఓసీలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్, మోదీ, చంద్రబాబుకు ఎన్నాళ్లు భయపడి బతుకుతామని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు భూముల దోపిడీలో పోటీ పడుతూ ఉత్తరాంధ్రను ఉత్తాంధ్ర చేశారని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీల మద్దతు తీసుకుంటామని చెప్తున్న జగన్, హోదా విషయంలో కేసీఆర్తో సానుకూల ప్రకటన చేయించగలరా? అని ప్రశ్నించారు. ప్రధాన పార్టీల నేతల్లో ఒకరు కుప్పంలో భూములను, మరొకరు ఇడుపులపాయలో ఎస్టేట్ను భద్రంగా ఉంచుకుని ఉత్తరాంధ్రాలో పేదల భూములు దోచుకుంటున్నారన్నారు. సమస్యను తొక్కిపెట్టేందుకు ‘మా షేర్ మాకివ్వండి’ అని పరిశ్రమల యాజమాన్యాలతో జగన్ బేరసారాలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు.