తనను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని యలమంచిలిలో పవన్ మాట్లాడుతూ తనను ఎలాగైనా ఓడించాలని ఏకంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వారెన్ని కోట్లు ఖర్చు చేసినా తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అయితే వారి తాట ఎక్కడ తీస్తానోనని భయపడుతున్నారని అన్నారు.
జనసేనలో పెద్ద నాయకులు ఎవరూ లేరని అంటున్న వారందరూ పుట్టగానే నాయకులయ్యారా? అని పవన్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటులో తుక్కు అమ్ముకున్న పంచకర్ల రమేశ్ బాబు ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. అవంతి శ్రీనివాస్ పార్లమెంటు కేంటీన్లో ఉచిత భోజనం తిని భుక్తాయాసంతో నిద్రపోతుంటారని ఎద్దేవా చేశారు. వీళ్లందరూ మన నేతలని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్నాడని దుయ్యబట్టారు. అందరికీ అందుబాటులో ఉండే సుందరపు విజయ్కుమార్ ఎమ్మెల్యే కాకూడదా? అని పవన్ ప్రశ్నించారు.