ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ శ్రీకాకుళం భాష, యాస, మాండలికంపై తనకు చాలా ప్రేమ ఉందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర వాసులు ఎవరైనా పులివెందులలో భూములు కొనగలరా? అని జనసేన పవన్ ప్రశ్నించారు.పులివెందులలో భూములు కొనాలంటే జగన్ కుటుంబసభ్యులు అడ్డుపడతారని విమర్శించారు.
కానీ పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తులు ఉత్తరాంధ్రలో వేల ఎకరాల భూములు కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తులు ఉత్తరాంధ్రలో వేల ఎకరాలను లాగేసుకున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలాగే జరుగుతూ పోతే రేపు మనం భూములు లేక బానిసలుగా ఉండాల్సి వస్తుందన్నారు. టీడీపీ గత ఐదేళ్లో రాష్ట్రాన్ని దోచేసిందనీ దుయ్యబట్టారు. ఈ దోపిడీ సొమ్ములో అచ్చెన్నాయుడు 60 శాతం, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు 40 శాతం పంచుకుంటున్నారని ఆరోపించారు.