వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 60 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర సమతుల్యత కోసమే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చెయ్యాలని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమరావతిలోని ప్రకాశం జిల్లా కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో పలు కీలక అంశాలపై చర్చించారు. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ విలీనం చెయ్యడానికి గల కారణాలను కార్యకర్తలతో పంచుకున్నారు.
ప్రజారాజ్యంలో చేరిన కొందరు నేతలు పదవీ వ్యామోహంతో చిరంజీవిని బలహీనంగా మార్చారని పవన్ స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి జనసేనకు రాకూడదన్న ఉద్దేశంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2 వేల కోట్లు కావాలంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు నడపడానికి డబ్బు అవసరం లేదన్నారు. పీఆర్పీ ఉంటే సామాజిక న్యాయం జరిగి ఉండేదని, ఓపిక లేని నాయకులు చేరడం వల్ల అవకాశం చేజారిందని పవన్ అన్నారు.