జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ పార్టీ అధినేత మేనిఫెస్టో పేరుతో వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన తనకు కులం అంటగట్టవద్దని, తాను ఒక కులానికి చెందిన వాడిని కాదని, తనకు కుల పట్టింపు లేదని చెప్పారు. కులాలను కలిపే పార్టీ తమదని అన్నారు. అయితే గత ఎన్నికలలో ఏమి ఆశించకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికామని, అయినా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరపొవటంతో బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. తాను సీఎం కుమారుడిని కాదని, కానిస్టేబుల్ కుమారుడనని గుర్తుచేశారు. తన బలం అభిమాన గణం ఉన్న తూర్పు గోదావరిలోనే అని కొందరు అంటున్నారని, దానిని తప్పని నిరూపించాలని చెప్పారు.
ప్రజలు కోరితే తెలంగాణలోనూ పోటీ చేసేందుకు సిద్ధం అని ఆయన అన్నారు. తెలంగాణాలో కొందరు ఏపీకి చెందిన వాళ్ళను నీచంగా చూశారని; ఇక ఏపీలో కూడా రాజకీయం రెండు కులాల మధ్య జరగటం విచారకరం అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రైతులకు వరాల జల్లు కురిపించారు. ఎకరాకు 8000 పెట్టుబడి; 60ఏళ్ళ వయసు దాటిన వారికి 5000 పింఛన్; ఉచితంగా సోలార్ మోటార్లు; గిట్టుబాటు ధర; ప్రతి ఒక్కరిని 10 లక్షల ఆరోగ్య భీమా ఇస్తామంటూ ప్రకటించారు.
పోలీసులకు 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాడటమని, సీఎం పదవిని కూడా లోకాయుక్త పరిధిలోకి తెస్తామని చెప్పారు. సీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు; ఒకటి నుండి పీజీ వరకు ఉచిత విద్య; అధికారం చేపట్టిన 6 నెలలలో లక్ష ఉద్యోగాలు; ఐదేండ్లలో 10 లక్షల ఉద్యోగాలు; ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి ఫీజు చెల్లించేలా చర్యలు తదితర హామీలు ఇచ్చారు. డొక్కా సీతమ్మ కాంటీన్ ల ద్వారా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు.
బీసీలకు 5 శాతం రేజర్వేషన్లు; నదుల అనుసంధానం; కొత్త జలాశయాల నిర్మాణం; రెండేళ్లలోపే అందరికి సురక్షిత మంచినీటి సరఫరా; మైనారిటీల అభ్యున్నతికి సచార్ కమిటీ సిఫారసు; అసెంబ్లీ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లు; ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సీలిండర్, ప్రతి పండుగకు చీరలు, ఉద్యోగులకు శిశు సంరక్షణ కేంద్రాలు, పావలా వడ్డీకే రుణాలు ప్రకటించారు.